అధియాపై ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆగ్రహం

28 Jun, 2018 04:11 IST|Sakshi
రాజేశ్వర్‌ సింగ్‌

న్యూఢిల్లీ: కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియాపై ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేశ్వర్‌ సింగ్‌ మండిపడ్డారు. కుంభకోణాలు చేసిన వారు, వారి సంబంధీకుల విషయంలో రాజేశ్వర్‌ అనుకూలంగా వ్యవహరించారంటూ ఇటీవల అధియా వ్యాఖ్యానించారు. దీనిపై జూన్‌ 11న అధియాకు పంపిన లేఖలో రాజేశ్వర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘20 ఏళ్లుగా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారుల నుంచి ‘అద్భుతంగా పనిచేశావంటూ’ ప్రశంసలందుకున్నాను. నేను ఎప్పుడూ తప్పచేయలేదు. మీరు వివిధ సందర్భాల్లో నేను సుప్రీంకోర్టుసహా న్యాయవ్యవస్థనూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని తోటి అధికారుల ముందు అవమానకరంగా మాట్లాడారు. అది నన్ను చాలా బాధించింది’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే, రాజేశ్వర్‌ సింగ్‌పై గతంలో ఇచ్చిన అధికారిక ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ లేఖ విషయం బయటకొచ్చింది. 

మరిన్ని వార్తలు