చిదంబరం కేసు: ఈడీ అనూహ్య నిర్ణయం

23 Aug, 2019 08:24 IST|Sakshi

ఈడీ అధికారి రాకేష్‌ అహుజా బదిలీ

న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ. చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును తొలినుంచి విచారిస్తున్న ఈడీ అధికారి రాకేష్‌ అహుజాను బదిలీ చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా పంపిస్తున్నట్లు గురువారం అర్థరాత్రి ప్రకటన వెలువడింది. ఆయన ప్రస్తుతం ఈడీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చిదంబరం అరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడంలో రాకేష్‌ కీలక పాత్ర పోషించారు.

కాగా ఈడీ తాజా అనూహ్య నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత హఠాత్తుగా అహుజాను బదిలీ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం బుధవారం అరెస్ట్‌ అయిన మాజీ కేంద్రమంత్రికి సీబీఐ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో  నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. 

(చదవండి: సీబీఐ కస్టడీకి..చిదంబరం)

మరిన్ని వార్తలు