మ‌రోసారి అహ్మ‌ద్ ప‌టేల్‌ విచార‌ణ‌

30 Jun, 2020 12:45 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అహ్మద్ ప‌టేల్‌కు మ‌రోసారి ఈడీ సెగ త‌గిలింది. మనీలాండరింగ్ కేసులో అహ్మద్ ప‌టేల్‌ను మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో విచారించ‌నున్నారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల శనివారం అహ్మద్ పటేల్ నివాసంలో 8 గంట‌ల‌పాటు సుదీర్ఘంగా ఆయనను విచారించిన విష‌యం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటిక్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు ఇవ్వ‌గా, కరోనావైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చిన కారణంగా విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. (అహ్మద్‌ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం)

ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్  5వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో నిరర్ధక అస్తులుగా మారాయి. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మోసం ఆరోపణలు మొత్తం 8,100 కోట్ల రూపాయ‌ల‌కు చేరాయి. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కేసుకు సంబంధించి అహ్మద్ పటేల్ పాత్రపై ఈడీ విచారణ సాగిస్తోంది. స్టెర్లింగ్ బయోటిక్‌కు చెందిన సందేశ‌ర సోద‌రులు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. నైజీరియాలో దాక్కున్న స్టెర్లింగ్ బయోటిక్ ప్రమోట‌ర్లు నితిన్‌, చేత‌న్‌ను భారత దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు  ఏజెన్సీలు ప్రయత్నం చేస్తున్నాయి. (అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు)

మరిన్ని వార్తలు