లాలూ ఫ్యామిలీకి భారీ షాక్‌

13 Jun, 2018 09:36 IST|Sakshi

పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి భారీ షాక్‌ తగిలింది. లాలూ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న 11 ఫ్లాట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) జప్తు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణం జరగుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్‌ రేట్‌ ప్రకారం వీటి విలువ 44.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ హోటల్‌ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ ఈ స్థలాన్ని సీజ్‌ చేసినట్టు ఈడీ తెలిపింది.  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఫ్లాట్లను జప్తు చేసినట్టు పేర్కొంది.

ఈడీ జప్తు చేసిన ప్రాపర్టీ తొలుత డీలైట్‌ మార్కెటింగ్‌ ప్రైవేటు కపంనీ పేరు మీద ఉండగా.. ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్ పేరు మీద ఉన్నాయి. అందులో లాలూ సతీమణి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు లాలూ తనయులు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆరువారాల ప్రొవిజనల్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు