కేజ్రీవాల్‌ను ఆశీర్వదించిన బామ్మ!

28 Dec, 2019 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అంటూ.. ప్రచార హోరును పెంచడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. గత ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్‌ రిపోర్టును ప్రజల ముందుంచారు. మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. టౌన్‌హాల్‌ సమావేశాల పేరిట కేజ్రీవాల్‌ ప్రజలతో మిళితమై.. ఇప్పటివరకు తాను చేసిన హామీల అమలును వివరిస్తూనే, బీజేపీని విమర్శిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టౌన్‌హాలు సమావేశంలో కేజ్రీవాల్‌ను కలిసిన ఒక వృద్ధురాలు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మంచి పనులు చేస్తూ.. బాధ్యతయుతమైన కొడుకుగా వ్యవహరిస్తున్నకేజ్రీవాల్‌ను ఒక్కసారైనా కలిసి, ఆశీర్వదించాలని ఉండేదని చెప్పుకొచ్చారు. తన ఆకాంక్ష ఇప్పుడు నెరవేరిందని, సీఎం కేజ్రీవాల్‌ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ఆమెకు పాదాభివందనం చేశారు.  అనంతరం అభిమానులతో కలిసి పెద్దావిడ ఆశీర్వదించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకొన్నారు.

మరిన్ని వార్తలు