సోషల్‌ మీడియా ప్రచారంపై ఈసీ గైడ్‌లైన్స్‌

10 Mar, 2019 19:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. నెట్టింట్లో పార్టీలు, అభ్యర్ధుల ప్రచారంపై ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో పొందుపరిచే అన్ని ప్రకటనలపై ముందుగానే ఈసీ నుంచి అనుమతి పొందాలి.

అభ్యర్ధులు తమ సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలి. మీడియా సర్టిఫికేషన్‌, పర్యవేక్షక కమిటీలో సోషల్‌ మీడియా నిపుణులు ఉంటారని ఈసీ పేర్కొంది. ఆన్‌లైన్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరాంగణంలో కత్తులు దూసే క్రమంలో సోషల్‌ మీడియా ప్రచారం శ్రుతిమించకుండా ఉండేందుకు ఈసీ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ నిబంధనల ఉల్లంఘనపై అందే ఫిర్యాదులను పరిశీలించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ అధికారిని నియమించాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా వెల్లడించారు. ఆన్‌లైన్‌లో రాజకీయ పార్టీల ప్రకటనలు, ప్రచారంపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సరళి, ఫలితాలపై సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌, అతిగా స్పందించే ధోరణి పట్ల అరోరా ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు