పాల కల్తీకి ఇలా చెక్!

19 Mar, 2016 19:40 IST|Sakshi
పాల కల్తీకి ఇలా చెక్!

న్యూఢిల్లీ: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్. భారత్‌లో 14.60 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఈ పాలల్లో 68 శాతం కల్తీవేనని సాక్షాత్తు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్దన్ ఈ నెల 16వ తేదీన లోక్‌సభ సాక్షిగా వెల్లడించడమే విషాధకరం. ఈ పాలల్లో కల్తీదారులు యూరియా, కాస్టిక్ సోడా, డెటర్జెంట్స్, రిఫైన్డ్ ఆయిల్, తెల్లరంగు, ఇతర రసాయనాలు కలుపుతూ మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.


పాలల్లో ఏ రసాయనాలు ఎంత మోతాదులో కలిశాయో తెల్సుకోవాలంటే ఒక్కో రసాయనం పరీక్షకు ఒక్కో పరికరాన్ని ఉపయోగించాల్సి రావడం, ఆ పరికరాలన్నింటికీ దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలదాకా ఖర్చవడం, నిపుణులు మాత్రమే వాటిని ఉపయోగించాల్సి ఉండడం వల్ల పాల కల్తీదారుల ఆటలు ఇంతకాలం సాగాయి. ఇకముందు ఆ అవసరం లేకుండా రాజస్థాన్, ఫిలానీలోని ‘సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రిసెర్చ్ యూనిట్’ ఓ సరికొత్త పరికరాన్ని కనుగొన్నది. దీన్ని ఉపయోగించి కేవలం 45 సెకండ్లలోనే పాలలో కలసిన అన్ని రకాల రసాయనాలను ఏకకాలంలో కనుగొనవచ్చు. ఈ పరికరం ఖరీదు 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇది కొనాలంటే వినియోగదారుడికి భారమే అవుతుంది కనుక ఎక్కడికక్కడ ఆరోగ్య శాఖ అధికారులు వీటిని కొనుగోలు చేసి పాల కల్తీని సులభంగానే అరికట్టవచ్చు. ఈ సరికొత్త పరికరం ద్వారా ఓ శ్యాంపుల్ కల్తీని కనుగొనేందుకు కేవలం రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

మరిన్ని వార్తలు