భువనేశ్వర్: జాతీయ రహదారిపై ఏనుగుల గుంపు హడలెత్తించింది. కటక్ అనుగుల్ 55వ నంబరు జాతీయ రహదారిపై కటక్ జిల్లా బల్లి బొవులొ ఛక్ వద్దకు సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు తరలివచ్చింది. గంటల తరబడి జాతీయ రహదారిపై తిరుగాడటంతో వాహనాల రవాణా స్తంభించిపోయింది.
అటవీ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల గుంపును తరిమి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. గుంపులో 8 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. అడవిలో వేడి తాళలేక జాతీయ రహదారి ఇరు వైపులా ఉన్న మామిడి చెట్ల ఛాయలో సేద తీరేందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు వివరించారు.