శ్రీనగర్: భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా బాత్పుర ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో శనివారం రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని చుట్టు ముట్టి జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు.
ఉదయం నుంచి జరుగుతున్న ఈ కాల్పుల్లో తాహెరా(44) అనే మహిళ మృతి చెందింది. సమీపంలోని ఓ భవంతిలో లష్కరే తొయిబా ముఖ్య కమాండర్తో పాటు మరికొందరు ఉగ్రవాదులు దాక్కొని ఉండటంతో పోలీసులు అక్కడి నుంచి స్థానికులను తరలించడానికి యత్నిస్తున్నారు. కార్డెన్ సెర్చ్ చేస్తున్న బలగాలపై పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.