న్యూఢిల్లీ: దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులపై దాడుల నేపథ్యంలో వారి రక్షణకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంలో ఉత్తరాఖండ్లో కశ్మీరీలకు అద్దెకిచ్చిన వారి గృహ యాజమానులు భయపడి, కశ్మీరీలను ఖాళీచేయిస్తున్నట్టు సమాచారం అందినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇళ్లు ఖాళీ చేసిన కశ్మీరీలు
అంబాలా: గ్రామంలో అద్దెకుంటున్న కశ్మీరీలను వెనక్కి పంపాలని హరియాణాలోని అంబాలా గ్రామపంచాయతీ తమ గ్రామస్తులను ఆదేశించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఒక వీడియో ప్రకారం, ములానా గ్రామ సర్పంచ్ నరేశ్ ఒక వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘దాడిలో కొందరు కశ్మీరీల ప్రమేయం ఉంది. 24 గంటల్లోగా అద్దెకుంటున్న కశ్మీరీలను పంపించివేయాలి’ అని వీడియోలో ఉంది. వీడియోను చూసిన కొందరు కశ్మీరీలు ఇళ్లు ఖాళీచేసి యూనివర్సిటీ హాస్టల్కు మకాం మార్చినట్లు సమాచారం. అంబాలాలోని వర్సిటీల్లో దాదాపు 1,200 మంది కశ్మీరీలు చదువుతున్నట్టుగా సమాచారం.