‘370’ భారత అంతర్గత వ్యవహారం

31 Oct, 2019 04:00 IST|Sakshi
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఈయూ బృందం

కశ్మీర్లో పర్యటించిన ఈయూ పార్లమెంటేరియన్ల బృందం వ్యాఖ్య

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు అనేది భారత అంతర్గత వ్యవహారమని కశ్మీర్లో పర్యటిస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటేరియన్ల బృందం పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కశ్మీర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఈయూ పార్లమెంటేరియన్ల బృందం భారత్‌కు రావడం తెల్సిందే. కశ్మీర్‌పై అంతర్జాతీయ మీడియా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, అక్కడికి వెళ్లాక ఇక్కడి వాస్తవ పరిస్థితిని వారికి వివరిస్తామని తమ పర్యటన అనంతరం ఈయూ ఎంపీలు తెలిపారు. కశ్మీరీలు తాము భారతీయులమనే భావిస్తున్నారని, వారు శాంతియుత భవిష్యత్తునే కోరుకుంటున్నారని వివరించారు. తమను ఫాసిస్టులు అంటూ ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

అతిపెద్ద తప్పు..
కశ్మీర్లోకి ఈయూ పార్లమెంటేరియన్ల బృందాన్ని అనుమతించడం భారత విదేశాంగ విధాన చరిత్రలోనే అతిపెద్ద తప్పిదంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత్‌ను అవమానపరుస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఆరోపించారు.
 

>
మరిన్ని వార్తలు