ఇండోర్: భారత్ కేవలం హిందువుల దేశమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జర్మనీ ఎవరి దేశం? జర్మన్లది. బ్రిటన్ బ్రిటిషర్లది. అమెరికా అమెరికన్లది. అలాగే హిందుస్తాన్(భారత్) హిందువులది’ అని అన్నారు. ఇతర మతస్తులు భారత్లో జీవించవచ్చని సెలవిచ్చారు. భారత సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవారందరూ భారతీయులేనన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ కూడా దేశాన్ని గొప్పగా మార్చలేరని, ఇందుకు తొలుత సమాజంలో చైతన్యం రావడం అవసరమన్నారు. ప్రజలు తమ మనసుల్లోంచి అన్ని రకాల వివక్షల్ని తొలగించుకుంటేనే భారత్ శక్తిమంతమైన విశ్వ గురువుగా అవతరిస్తుందన్నారు.