రూ. 90 లక్షలు చేజారడంతో ఆగిన గుండె..

15 Oct, 2019 11:18 IST|Sakshi

ముంబై : పీఎంసీ బ్యాంక్‌ స్కామ్‌ ఖాతాదారులు, డిపాజిట్‌దారుల ఉసురు తీస్తోంది. పీఎంసీ స్కామ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని ఇంటికి తిరిగివచ్చిన సంజయ్‌ గులాటీ అనే వ్యక్తి గుండె పోటుకు గురై మరణించిన ఘటన వెలుగుచూసింది. ముంబైలోని ఓషివర ప్రాంతానికి చెందని తపోర్‌వాలా గార్డెన్స్‌లో నివసించే సంజయ్‌ గులాటీకి పీఎంసీ బ్యాంక్‌ ఓషివర బ్రాంచ్‌లో రూ.90 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. సంజయ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన సంజయ్‌ను పీఎంసీ బ్యాంక్‌ స్కామ్‌ మరింత విచారానికి లోనుచేసింది. పీఎంసీ డిపాజిటర్ల విత్‌డ్రాయల్‌ పరిమితిపై ఆర్‌బీఐ నియంత్రణలు విధించడం ఆయనను బాధించింది.

పీఎంసీ బ్యాంక్‌లో సంజయ్‌ ఆయన భార్య, తల్లితండ్రులకు సంబంధించి మొత్తం నాలుగు ఖాతాల్లో రూ. 90 లక్షల డిపాజిట్లున్నాయి. తాను ఉద్యోగం​ కోల్పోవడం, తమ డిపాజిట్లున్న పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర మనస్ధాపానికి లోనైన సంజయ్‌ గుండెపోటుతో మరణించారు. సోమవారం ఎర్రకోట సమీపంలోని కిల్లా కోర్టు వద్ద జరిగిన నిరసనలో సంజయ్‌ గులాటీ పాల్గొని మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చి భార్యను భోజనం తీసుకురమ్మని కోరారని, లంచ్‌ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువు రాజేష్‌ దువా తెలిపారు. సంజయ్‌ను కోకిలాబెన్‌ ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు.

>
మరిన్ని వార్తలు