న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ద్వారా అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని ఈ నెల 26 నుంచి ఉత్తరప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని 2017 జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం గతంలో నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.
గతంలో చేపట్టిన ప్రయోగాల్లో అనేక బూటకపు కాల్స్ రావటంతో దీనిని అమలు చేయలేదన్నారు. పాత మొబైల్ వినియోగదారులు కీని నొక్కిన వెంటనే సమీపంలోని 25–50 మందికి సమాచారం అందుతుందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి చేతన్ సంఘీ తెలిపారు. ప్రస్తుతం పాత మొబైళ్ల(కీ ప్యాడ్ ఉన్న ఫోన్లు)ను మాత్రమే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, కొత్త మొబైళ్లలో ఈ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.