పాక్‌ ప్రజలకు భారత్‌ తీపి కబురు

2 May, 2020 15:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా 193 మంది పాకిస్తాన్‌ ప్రజలను మే 5న వారి సొంత దేశానికి తరలించడానికి అనుమతి ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి ఓ పకటనలో తెలిపారు. అట్టారి-వాఘా సరిహద్దు గుండా వారిని తమ దేశానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పది రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో 193 పాకిస్తానీయులు చిక్కుకున్నారు. ఇక వారిని మంగళవారం అట్టారి-వాఘా సరిహద్దు వరకు సురక్షితంగా తీసుకురావాలని ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారలకు విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?)

మే 5న ఇమ్మిగ్రేషన్‌, సరిహద్దు తనిఖీ ప్రక్రియ ప్రారంభమవుతుందని విదేశాంగశాఖ తెలిపింది. పాకిస్తాన్‌ హైకమిషన్‌ భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తమ పౌరులను తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది పాకిస్తాన్‌ ప్రజలను ఒక సమూహంగా తమ దేశానికి భారత ప్రభుత్వం పంపించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లోని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలో చిక్కుకున్న193 మంది పాకిస్తాన్‌ ప్రజలు తమ స్వదేశానికి చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు