మార్చురీలో శవంనుంచి కళ్లు మాయం

21 Aug, 2019 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : మార్చురీలో ఉంచిన మృతదేహంనుంచి కళ్లు మాయమైన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన శంభునాథ్‌ దాస్‌ (69) గత ఆదివారం ఓ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ‘ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌’కు తరలించారు. ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు.

అయితే శంభునాథ్‌ మృతదేహంలో కళ్లు లేకపోవటం గుర్తించిన వారు ఆసుపత్రి సిబ్బందిని పశ్నించారు. ‘‘ ఆయన కళ్లను ఎలుకలు తినేశాయి’’ అని సిబ్బంది చెప్పిన సమాధానంతో వారు నిర్ఘాంతపోయారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ శుంభునాథ్‌ కొడుకు సుశాంత ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై స్పందించిన అధికారులు మంగళవారం దర్యాప్తుకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు