తలనొప్పులు తెచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌

15 Aug, 2019 19:35 IST|Sakshi

గువహటి: రెండేళ్ల క్రితం చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఓ మహిళకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. గువహటి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్నా రెహనా సుల్తానా.. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఈ రోజు నేను బీఫ్‌ తిని పాకిస్థాన్‌కు మద్దతు తెలపాలనుకుంటున్నాను. నా ఆహార నియమాలను స్వేచ్ఛగా నిర్ణయించుకునే హక్కు నాకుంద’ని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పోస్ట్‌కు సంబంధించి తాజాగా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ పోస్ట్‌కు సంబంధించిన ఫొటో బుధవారం ఓ స్థానిక న్యూస్‌ వెబ్‌సైట్‌లో కనిపించడంతో  కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఆ తర్వాత దీనిపై రెహనాను ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన రెహనా.. ఆ పోస్టు చేసింది తానేనని అంగీకరించారు. కానీ దానిని వెంటనే తొలగించినట్టు తెలిపారు. రెండేళ్ల క్రితం జూన్‌ 2017లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆ పోస్టు చేశానని అన్నారు. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సున్నా పరుగులకే అవుట్‌ కావడాన్ని క్రికెట్‌ అభిమానిగా జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. తర్వాత అలా పోస్టు చేయడం తప్పని తెలుసుకొని కొద్ది నిమిషాలకే తీసేశానని చెప్పింది.

అలాగే  నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బిల్లును ఒక పద్యం ద్వారా విమర్శించారు. అందుకు గానూ పోలీసులు ఆమెతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఎన్‌ఆర్సీ విధానంలో మార్పులు తీసుకురావాలనే డిమాండ్‌తో తాను పోరాటం చేస్తున్నాని రెహనా చెప్పారు. అందుకోసమే తనపై అక్రమ కేసులు పెడుతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు