రైతులను విస్మరించారు

1 May, 2015 01:58 IST|Sakshi
రైతులను విస్మరించారు

  పెట్టుబడిదారులకే మోదీ సర్కారు అండ: రాహుల్
  విదర్భలో రైతు పాదయాత్ర
  రైతాంగం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది
  రైతులు మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు
  అందరూ రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు

 
 టాంగ్లాబాద్ (మహారాష్ట్ర): దేశం వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. తన మిత్రులైన పెట్టుబడిదారులకు అండగా నిలుస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వ్యవసాయ సంక్షుభిత ప్రాంతాల్లో రాహుల్ గురువారం సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. (రైతులు) విస్మరణకు గురయ్యామన్న భావనలో ఉన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి సహాయ హస్తం అందించటం ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్ర. కానీ.. మహారాష్ట్రలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వారిని వదిలివేశాయి.


బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తమకు బోనస్ చెల్లించకుండా నిరాకరించారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కొందరు సన్నిహిత పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తోంది. రైతులు, పేదలు, కార్మికులను పరిరక్షించటంపై ఈ సర్కారుకు ఎలాంటి ఆసక్తీ లేదు’’ అని మండిపడ్డారు. ‘‘ఇది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచే ప్రభుత్వం కాదు. బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వమిది. పత్తి పండించే ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను నేను కలిసిన తర్వాత.. రైతాంగానికి పరిస్థితి బాగోలేదని నాకు అర్థమైంది’’ అని ఆయన పేర్కొన్నారు. కేవలం ముగ్గురు రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంటులో చెప్పటం ద్వారా రైతులను మరింతగా అవమానించారని రాహుల్ విమర్శించారు.


రుణాల మాఫీ కోరుతున్నారు..
రైతులు మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అన్నిటికన్నా పెద్ద సమస్య అప్పు అని రాహుల్ చెప్పారు. ‘‘మేం ఎక్కడికి వెళ్లినా.. రైతులు తమ రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు. విదర్భలో, పంజాబ్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పదేపదే నాకు అందుతున్న రెండో ఫిర్యాదు.. రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పొందటం లేదు. ఎంఎస్‌పీని పెంచలేదు. బోనస్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు రైతులకు బోనస్ అందేది.. ఇప్పుడు అందటం లేదు. రైతులకు అందాల్సిన సహాయం అందటం లేదు’’ అని అన్నారు.


ఉదయం అమరావతి జిల్లాలో పాదయాత్ర (సంవాద్ యాత్ర) ప్రారంభించిన రాహుల్.. పలు గ్రామాల్లోని రైతులతో సంభాషించారు. హరిపూర్ గ్రామంలో జనపనార చాపపై కూర్చుని పలువురు సన్నకారు రైతుల కష్టాలను విన్నారు. గుంజి, షాపూర్ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి రైతులను కలుసుకున్నారు. రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు. 2006 నుంచి 2014 మధ్య ధామన్‌గావ్ తాలూకాలో దాదాపు 171 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. నష్టపోయిన పంటకు ఇవ్వాల్సిన పరిహారం బీమా సంస్థలు చెల్లించటం లేదని కొందరు పేర్కొన్నారు. ఎరువులు, పురుగుమందులను తమకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మండుటెండలో పాదయాత్ర నిర్వహించిన రాహుల్ వెంట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
‘రాజకీయం చేస్తే విస్మరిస్తాం’
రైతుల పరిస్థితిని మెరుగుపరచే విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏవైనా సూచనలు ఇస్తే అంగీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ రైతాంగ అంశాలను రాజకీయం చేయటం ఆయన మానుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతుల సమస్యలను అర్థం చేసుకోవటానికి రాహుల్ విదర్భ వచ్చి ఉంటే.. అది మంచి పని. వారి జీవితాలను మెరుగుపరచేందుకు ఆయన సలహాలను మేం అంగీకరిస్తాం. కానీ.. ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే.. మేం విస్మరిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు