భారత్‌కు గుణపాఠం తప్పదు : ఫరూక్‌ అబ్దుల్లా

28 Jun, 2019 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ/ఒసాకా : అగ్రరాజ్యం అమెరికా చేతిలో భారత్‌కు గుణపాఠం తప్పదని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా హెచ్చరించారు. ఓవైపు తమ ఉత్పత్తులపై భారత్‌ భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని ట్రంప్‌ అసహనం వ్యక్తం చేస్తుండగా.. మన ప్రధాని మాత్రం టెర్రరిజం, పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం అంశాలే ప్రధానంగా జీ20 సదస్సులో ప్రసంగించడం సరైనదికాదని అభిప్రాయపడ్డారు. పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుని అమెరికాతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలని మోదీకి హితవు పలికారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే  28 ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
(చదవండి : ట్రంప్‌తో మోదీ చర్చించిన అంశాలివే..)

ఇదిలాఉండగా... జపాన్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్‌ వ్యవహారాలు, 5జీ నెట్‌వర్క్‌, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని వైట్‌ హౌస్‌ ట్వీట్‌ చేసింది.
(చదవండి : ‘కశ్మీర్‌ రిజర్వేషన్‌’ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్‌రెడ్డి)

ఇక జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి గత సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే, ఈ చట్టంతో ఇతరుల రిజర్వేషన్లకు భంగం కలగొద్దని అన్నారు. ఈ బిల్లు ప్రకారం జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దుకు 10కిలోమీటర్లు, కశ్మీర్‌లో నియంత్రణరేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు