జొమాటోకు రూ. 55 వేల జరిమానా

6 Jul, 2019 18:02 IST|Sakshi

ముంబై : ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు పూణె వినియోగదారుల కోర్టు రూ. 55 వేల జరిమానా విధించింది. వివరాలు.. ముంబైకు చెందిన లాయర్ దేశ్‌ముఖ్ బాంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పనిమీద పూణెకు వెళ్లారు. ఆరోజు ఏదో వ్రతంలో ఉన్న ఆయన అక్కడ ఓ పంజాబీ ధాబా నుంచి వెజిటేరియన్ ఫుడ్‌ అయిన... పన్నీర్ బటర్ మసాలా జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాడు. కానీ అతనికి బటర్‌ చికెన్‌ డెలివరీ చేశారు. ఈ విషయం గురించి డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసి అడగ్గా.. తనకేం సంబంధం లేదన్నాడు. దాంతో దేశముఖ్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

దేశ్‌ముఖ్‌ ఫిర్యాదుపై స్పందించిన యజమాని.. పొరపాటు జరిగింది మళ్లీ పంపిస్తానంటూ... మరోసారి కూడా చికె‌న్‌ పంపించాడు. అసలే ఆకలి మీద లాయర్‌ లోపల ఉన్న పదార్థం ఏంటో గమనించకుండా తినేశాడు. తీరా తిన్న తర్వాత అది చికెన్‌ అని తెలిసింది. శాకాహారిని అయిన తనతో చికెన్‌ తినిపించినందుకు గాను సదరు లాయర్‌ జొమాటో మీద వినియోగదారుల కోర్టులో కేసు నమోదు చేశారు. తన ధార్మిక భావనలు దెబ్బతినేలా ప్రవర్తించిన హోటల్‌తో పాటు జొమాటోపై కూడా ఫిర్యాదు చేశాడు. దేశముఖ్ ఫిర్యాదును విన్న కోర్టు...జొమాటోతో పాటు రెస్టారెంట్‌కు నోటీసులు అందించింది. వెంటనే రూ.55 వేలు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. అయితే జొమాటో మాత్రం తమకెలాంటి నోటీసులు అందలేదని చెబుతోంది. 

>
మరిన్ని వార్తలు