వధూవరులను ఆశీర్వదిస్తూ ప్రధాని లేఖ

9 Sep, 2019 13:58 IST|Sakshi

చెన్నై : ఇంట్లో వివాహం వంటి శుభకార్యం జరిగితే ఇళ్లంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువులతో పెళ్లింట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఓ కుటుంబానికి తమ ఇంట్లో వివాహం జరుగుతుందనే ఆనందం కంటే అత్యున్నత పదవిలోని వ్యక్తి పంపిన సందేశం వారిని ఉద్వేగానికి లోనుచేసింది. వివరాలు.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన రాజశేఖరన్‌ అనే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్‌ 11న నిశ్చయించాడు. పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లతోపాటు  ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆహ్వనించాడు. ఇందులో భాగంగా ప్రధానికి లేఖ రాశాడు. తరువాత కుటుంబం పెళ్లి పనుల్లో మునిగిపోయిన కుటుంబం ఈ విషయం గురించి మరిచిపోయింది.

అయితే గత శనివారం ప్రధాని నుంచి కుటుంబానికి ఓ లేఖ అందింది. అది చదివిన కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయారు. ప్రధాని పంపిన లేఖలో ‘‘మీ కుమార్తె వివాహం గురించి నాకు తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ ఇంట్లో జరిగే శుభ  సందర్భానికి  నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నూతన వధువరులకు నా శుభాకాంక్షలు, నవ జంట ఎల్లప్పుడు శ్రేయస్సు, ఆనందాలతో జీవించాలి’’ అని ప్రధాని లేఖలో ఆశీర్వదించారు. ఏకంగా ప్రధాని నుంచి వధూవరులను ఆశీర్వదిస్తూ లేఖ రావడంతో రాజశేఖరన్‌ కుటుంబం సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. ప్రధాని పంపించిన లేఖను ఫ్రేమ్‌ కట్టించాలని నిర్ణయించుకున్నట్లు సదరు కుటుంబ సభ్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు