ముస్లిం యోగా గురువుకు ఫత్వా

11 Nov, 2017 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: యోగా శిక్షణ ఇస్తున్నందుకు ఇటీవల ఫత్వా అందుకున్న ముస్లిం యోగా గురువు రఫియా నాజ్‌ ఇంటిపై శుక్రవారం ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడింది. జార్ఖండ్‌లోని దరోందాలో ఉంటున్న రఫియా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న  సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ ఇంటర్వ్యూలో రఫియా వ్యాఖ్యలు విన్న ఓ మతపెద్ద ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని రగిలిపోయాడు. వెంటనే ఓ గుంపుతో రఫియా ఇంటివద్దకు చేరుకుని హంగామా సృష్టించాడు. ఈ గుంపు ఆమె ఇంటిపై రాళ్లు విసురుతూ నినాదాలిచ్చింది.

ఇటీవల ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాతో కలిసి వేదిక పంచుకోవడంతో రఫియాకు కొందరు మతపెద్దలు గురువారం ఫత్వా జారీచేశారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం రఘుబర్‌దాస్‌ ఆమెకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించారు. తాజాగా రఫియా ఇంటిపై దాడి ఘటనపై బాబా రాందేవ్‌ స్పందిస్తూ..‘ఇరాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లోని ముస్లింలు యోగాను ఆచరిస్తారు. యోగా అన్నది మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించినది. ఇందులో మతం అన్న విషయాన్ని తీసుకురాకూడదు’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు