ఇది.. ఇన్ఫోడెమిక్‌ !

31 Mar, 2020 05:34 IST|Sakshi

కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తల స్వైర విహారం

నకిలీ వార్తలపై ఫ్యాక్ట్‌ చెకర్స్‌ యుద్ధం

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా విశ్వవ్యాప్త మహమ్మారి(పాన్‌డెమిక్‌)గా విజృంభిస్తుంటే.. మరోవైపు, ఆ ప్రాణాంతక వైరస్‌పై నకిలీ వార్తలు ‘సమాచార మహమ్మారి(ఇన్ఫోడెమిక్‌)’గా మారి ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వార్తలు, సలహాలు, భయంకర వీడియోలతో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. పలు అధికార సంస్థలు, వాస్తవాలను నిర్ధారించే అనధికార సంస్థలు(ఫ్యాక్ట్‌ చెకర్స్‌) ఈ నకిలీ వార్తల పనిపట్టే పనిలో ఉన్నప్పటికీ.. కరోనా కన్నా వేగంగా ఈ నకిలీ మహమ్మారి విస్తరిస్తోంది.

తప్పుడు వార్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని స్వచ్ఛంద సంస్థలను ప్రధాని మోదీ కూడా కోరాల్సిన స్థాయికి ఈ ఇన్ఫోడెమిక్‌ చేరింది.  కాగా, ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ విధించబోతున్నారన్న వార్తను ఆర్మీ ఖండించింది. కరోనాను ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్‌’ ఫండ్‌కు విరాళాలు పంపే వారిని మోసం చేసేందుకు రూపొందించిన నకిలీ యూపీఐ ఐడీని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం శిక్షార్హమైన నేరమని కేంద్ర హోం శాఖ నిర్ధారించిందన్న వార్తను కూడా అధికారులు ఖండించారు. కరోనా లక్షణాలకు సంబంధించి తొమ్మిది రోజుల టైమ్‌లైన్‌తో వేలాది పోస్ట్‌లు పలు ఫేస్‌బుక్‌ అకౌంట్లలో సర్క్యులేట్‌ కావడాన్ని ప్రైవేట్‌ ఫాక్ట్‌ చెకర్‌ ‘బూమ్‌ ఫాక్ట్‌చెక్‌’ గుర్తించింది. ఆ ఇన్ఫోగ్రాఫిక్‌ సరైంది కాదని నిర్ధారించింది.

మరిన్ని వార్తలు