ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా జయంతి: 10 ఆసక్తికర అంశాలు

3 Apr, 2018 14:52 IST|Sakshi
ఇందిరా గాంధీతో మానెక్‌ షా

సాక్షి: భారత ఆర్మీ మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌ షా జయంతి ఈరోజు(ఏప్రిల్‌ 3). భారత ఆర్మీ కమాండర్లలోని గొప్పవారిలో ఆయనకు ప్రథమ స్థానం దక్కుతుంది. ఈ రోజు ఆయన 104వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు..

1. శామ్‌ మానెక్‌ షా పూర్తి పేరు శామ్‌ హర్మోస్‌జీ ప్రేమ్‌జీ జంషెడ్జీ మానెక్‌ షా. జననం ఏప్రిల్‌ 3, 1914. మరణం జూన్‌ 27, 2008. మానెక్‌ షా తల్లిదండ్రులు పార్శీ మతానికి చెందినవారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు.

2. భారత ఆర్మీలో చేరతానని మానెక్‌ షా మొదట తండ్రికి చెప్పడంతో ఆయన నిరాకరించారు. దాంతో లండన్‌ వెళ్లి గైనకాలజిస్ట్‌ అవుదామని మానెక్‌ షా అనుకున్నారు. కానీ అదీ నెరవేరలేదు. చివరికి మళ్లీ ఇండియన్‌ మిలటరీ అకాడమీ ఎంట్రన్స్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణుడవ్వడంతో ఆర్మీలో చేరారు.

3.  మానెక్‌ షా 40 ఏళ్లు ఆర్మీలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం, ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం(1947), చైనా-ఇండియా యుద్ధం(1962), ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం(1966), బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం(1971)ఈ  ఐదు యుద్ధాల్లో పాల్గొన్న ఏకైక ఫీల్డ్‌ మార్షల్‌.

4. ఇండియా-పాకిస్తాన్‌ 1971 యుద్ధానికి ముందు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మానెక్‌ షాను అడిగింది. అప్పుడు ఆయన ‘ ఐ యామ్‌ ఆల్వేస్‌ రెడీ స్వీటీ’  అని అన్నారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్‌ గాంధీ పార్శీ మతస్తుడన్న సాన్నిహిత్యంతో ఆమెను స్వీటీ అని మానెక్‌ షా సంబోంధించేవారు.

5. మానెక్‌ షా పలుమార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బర్మాలో యువ కెప్టెన్‌గా జపాన్‌తో యుద్ధం చేయడానికి వెళ్లినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. 9 బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. సిపాయి శేర్‌ సింగ్‌  ఆయనను కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
 
6.  ఒక మనిషి తాను భయపడటం లేదు అని చెబితే అతడు అబద్ధం చెబుతున్నాడు అని అయ్యిండాలి లేదా అతను గోర్ఖా అయినా కావాలి అని గొప్ప కొటేషన్‌ ఇచ్చాడు.

7.  భారత దేశం విభజన జరిగిన సమయంలో మీరు పాకిస్తాన్‌ వెళ్లిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది ఓ వ్యక్తి అడిగినపుడు ఆయన సమాధానం ఏంటంటే...అన్ని యుద్ధాల్లో భారత్‌కు బదులు పాకిస్తాన్‌ గెలిచి ఉండేదని సరదాగా అన్నాడు.

8. ఆర్మీలో నుంచి రిటైర్‌ అవుదామన్న సమయంలో ఇష్టం లేకపోయినా 1972లో అప్పటి రాష్ట్రపతి ఆయన పదవీకాలాన్నీ 6 నెలలు పొడిగించడంతో  మరో ఆరు నెలలు సేవలు అందించారు.

9. ఆయన అందించిన సేవలకు గానూ 1942 మిలిటరీ క్రాస్‌  అవార్డు, 1968లో పద్మ భూషణ్‌ అవార్డు, 1972లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 

10. న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో న్యూమోనియాతో 2008, జూన్‌ 27న మానెక్‌ షా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు ఏ ఒక్క రాజకీయ నాయకుడూ హాజరుకాలేదు. కనీసం ఆయన చనిపోయిన రోజును జాతీయ సంతాప దినంగా కూడా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు