'ఈ యుద్ధం ముస్లింలపై కాదు.. అర్ధం చేసుకోండి'

1 Mar, 2018 17:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తున్న పోరాటం హింసపై, ద్వేషంపై చేస్తున్న పోరాటం మాత్రమే తప్ప ఏ ఒక్క మతంపైనో లేక ముస్లిం వర్గంపైనో కాదని జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2 అన్నారు. మహ్మద్‌ ప్రవక్త ప్రపంచమంతా మానవత్వం, దయ, జాలివంటివి వెల్లి విరియాలని ప్రచారం చేశారే తప్ప హింసకు పాల్పడాలని ఎక్కడా చెప్పలేదని అన్నారు. 'ఇది నా విశ్వాసం.. ఈ విశ్వాసం నేను నా బిడ్డలకు చెబుతాను. ఇదే విశ్వాసాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1.8బిలియన్ల ముస్లింలు పంచుకోండి' అని అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు.

ఇస్లామిక్‌ వారసత్వం : అవగాహన, ఆధునికత అనే అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఓ పక్క భారత్‌, జోర్డాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాదం, జాతి విధ్వేషంపై పోరాటానికి శంఖం పూరించిన సందర్భంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఉగ్రవాదంపై పోరాటం ఏ మతంపైనా కాదు.. అంతకంటే ముస్లింలపైనా కాదు.. విద్వేషం, హింసవంటి అంశాలపైనే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. కొన్ని వర్గాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి' అని అబ్దుల్లా అన్నారు.

మరిన్ని వార్తలు