చైనాతో రెండు యుద్ధాలు : వెనక్కి తగ్గేది లేదు

22 Jun, 2020 18:26 IST|Sakshi

చైనాకు వ్యతిరేకంగా రెండు యుద్ధాలు  : కేజ్రీవాల్

గెలిచి తీరుతాం, ఐక్యంగా ఉండాలి

సాక్షి, న్యూఢిల్లీ :  భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  కీలక వ్యాఖ్యలు చేశారు.  పొరుగు దేశం చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి  చైనా సరిహద్దులో, రెండవది  చైనా నుంచి వ్యాపించిన కరోనాతో పోరాడుతోందన్నారు. అయితే ఈ రెండు యుద్ధాల్లోనూ భారత్ గెలుస్తుందంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  అటు సరిహద్దులో సైనికులు, ఇటు కరోనాపై పోరులో వైద్యులు  ముందుండి పోరాడుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.  (మూడురెట్లు పెరిగిన టెస్టింగ్‌ సామర్థ్యం)

చైనాతో ప్రస్తుతం రెండు యుద్ధాలు చేస్తున్నామంటూ కేజ్రీవాల్ హిందీలో ట్విట్ చేశారు. లద్దాఖ్ సరిహద్దులో 20 మంది జవాన్లు వెన్నుచూపకుండా ధీరత్వాన్ని చూపారు. అదే తరహాలో తాము కూడా కరోనాను అంత మొందించేదాకా వెనక్కి తగ్గమన్నారు. ఈ పోరులో విజయం సాధిస్తామన్నారు. అంతేకాదు రాజకీయాలకు ఇది సమయం కాదనీ, ఐక్యంగా ఈ యుద్ధాలను గెలవాలని కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. 

ఢిల్లీలో కరోనా విస్తరణ, కట్టడిపై సీఎం కేజ్రీవాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా పరీక్షలను మూడు రెట్లు పెంచామని చెప్పారు. అంతకుముందు రోజుకు 5,000 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం దాదాపు 18 వేల పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హోమ్ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారికి  ఆక్సిజన్ స్థాయిలను మానిటర్ చేసేందుకు పల్స్ ఆక్సీమీటర్లు అందిస్తారు చెప్పారు.

మరిన్ని వార్తలు