నిర్మలా సీతారామన్‌పై అభిజిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 Oct, 2019 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్థిక రంగంలో విప్లవాత్మక పరిశోధనలు చేసి నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జేఎన్‌యూలో నిర్మలా సీతారామన్‌ తనూ సమకాలీనులమని అన్నారు. ఆయన 1983లో జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. నిర్మలాతో పలు అంశాలపై చర్చించేవాళ్లమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు అభిజిత్, ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో, మరో అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌లు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి అందుకోనున్న సంగతి తెలిసిందే.
(చదవండి : రాజద్రోహం, హత్యాప్రయత్నం నేరాల కింద అరెస్ట్‌ చేశారు)

ఇక భారత ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉందన్న బెజెర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘నోబెల్‌ ప్రైజ్‌ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ  బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు రాహుల్‌ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ అభిజిత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న కొంతమంది నాకు తెలుసు. వారిలో నిర్మలా సీతారామన్‌ ఒకరు. ఆమె, నేనూ ఒకే సమయంలో జేఎన్‌యూలో చదువుకున్నాం. మేము క్లోజ్‌ ఫ్రెండ్స్ కాదు. కానీ,  పలు అంశాలపై చర్చించుకునే వాళ్లం. అయినా, మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కావు.
(చదవండి : పేదరికంపై పోరుకు నోబెల్‌)

విశ్వవిద్యాలయంలో రకరకాల మనుషులు ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వారివి. మనదేశంలోని పరిస్థితులను ఆకలింపు చేసుకునేందుకు ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించడం కలిసొచ్చింది. సంక్లిష్టమైన భారత ఆర్థిక వ్యవస్థ, వైవిధ్యమైన జీవన విధాలను అర్థం చేసుకోవం కష్టమైనదే’ అని  అభిజిత్‌ అభిప్రాయపడ్డారు. ఇక అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు