‘సంపద సృష్టికే బడ్జెట్‌ పెద్దపీట’

3 Feb, 2020 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయ కేటాయింపులు సంపద సృష్టించే లక్ష్యంతో చేపట్టినవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ నిధుల ప్రవాహానికి సంబంధించి బడ్జెట్‌పై అంచనాలున్నా తాము ఆచితూచి ఆస్తుల సృష్టి కోసమే వెచ్చించాలనే విధానంతో ముందుకెళ్లామని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని ప్రజలు అంచనాతో ఉండవచ్చని అయితే వనరులు తగినంత ఉంటే ఖర్చు చేసేందుకు తాము సిద్ధమని, గతంలో జరిగిన దుబారా వంటి పొరపాట్లను తాము తిరిగి చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు.

తాము ప్రస్తుతం సంపద సృష్టించే కోణంలోనే వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చారు. మౌలిక రంగంలో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులను రెవిన్యూ ఖర్చుల కోసం వెచ్చించమని వాటిని ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మౌలిక రంగంపై వెచ్చిస్తామని వివరించారు. బడ్జెట్‌లో రంగాల వారీగా ముందుకు వెళ్లలేదని, అయితే ఆర్థిక వ్యవస్థను బడ్జెట్‌ స్థూలంగా ఆవిష్కరించిందని చెప్పుకొచ్చారు.

చదవండి : బంగారు బాతును చంపేస్తారా?

మరిన్ని వార్తలు