సీతారామన్‌...సుదీర్ఘ ప్రసంగం!

2 Feb, 2020 03:36 IST|Sakshi
బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న నిర్మలకు జాగ్రత్తలు చెబుతున్న రాజ్‌నాథ్, మోదీ

అలసటతో చివర్లో త్వరగా ముగింపు  

న్యూఢిల్లీ: కశ్మీరీ కవిత, తమిళ కవుల పలుకులు ఉటంకిస్తూ, సింధు నాగరికతను గుర్తు చేసుకుం టూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేశారు. దీంతో రికార్డు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. శనివారం పార్లమెంట్‌లో నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్‌ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. చివరలో కొంచెం అస్థత్వత కలగడంతో చివరి పేజీ లను చదవకుండా వదిలేశారు. లేదంటే నిర్మలమ్మ ప్రసంగం మూడు గంటలు దాటి ఉండేదే! గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. తిరిగి ఈ రోజు ఆమే తన రికార్డు బ్రేక్‌ చేశారు.

గతంలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ దాదాపు 2గంటల 13 నిమిషాల ప్రసంగం చేశారు. అంతకుముందు 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ చేసిన ప్రసంగం కూడా సుదీర్ఘమైనదే! తాజా ప్రసంగంలో కశ్మీర్‌కు చెందిన కవితను అటు కశ్మీరీ, ఇటు హిందీలో ఆమె ఉటంకిం చారు. దీనికితోడు కాళిదాస విరచిత రఘువంశంలోని శ్లోకాన్ని, ప్రముఖ తమిళకవి తిరువళ్లువర్‌ రచనలను ఆమె తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.  పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచి ఆమెను ప్రశంసించారు. బేటీ బచావో పథకం ప్రస్తావనతో పాటు పలు అంశాల వద్ద ప్రతిపక్షాలు ఆమె ప్రసంగానికి అడ్డుతగిలాయి. సుదీర్ఘ ప్రసంగం చివరలో అలసిన ఆమె తన మిగతా ప్రసంగం పూర్తయినట్లు భావిం చాలని స్పీకర్‌ను కోరి కూర్చుండిపోయారు. సీతారామన్‌ షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో పక్కనే కూర్చున్న మంత్రి గడ్కరీ ఆమెకు చాక్లెట్‌ ఇచ్చారు.  కాగా, ఆరోగ్యం, సంతోషం, సంపద, ఉత్పత్తి, భద్రత.. ఈ ఐదు ఒక దేశ అందమైన ఆభరణాలు’ అని ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్లువార్‌ కవితా పం క్తులను ఆమె ఉటంకించారు. ప్రసంగం అనంతరం మోదీ నిర్మలను ప్రశంసించడం కనిపించింది.  
 

మరిన్ని వార్తలు