కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

10 May, 2020 10:37 IST|Sakshi

ఢిల్లీ : నగరంలోని కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఆదివారం ఉదయం భావన ఇండస్ట్రియల్‌ ఏరియాలోని పరిశ్రమలో మంటలు రావడంతో ఆందోళన రేగింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లానికి 14 అగ్నిమాప‌క యంత్రాలు చేరుకుని మంట‌ల‌ల‌ను ఆర్పుతున్నాయ‌ని, ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని ఢిల్లీ ఫైర్ స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్ అతుల్ గార్గ్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని 29 ఇండస్ట్రియల్‌ ప్రాంతాల్లో భావన కారిడార్‌ ఒకటిగా ఉంది. కాగా  గురువారం తెల్లవారుజామున దర్యాగంజ్ సమీపంలోని ఒక వస్త్ర దుకాణానికి చెందిన ఒక గోడౌన్‌లో మంటలు చెలరేగి బాగానే ఆస్తి నష్టం సంభవించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా రోజులుగా మూతపడి ఉన్న పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడంతో తెరుచుకోవడం వరకు బాగానే ఉంది. పరిశ్రమల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. . వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల్లో ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంది.  విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ అనే గ్యాస్‌ లీకవడంతతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని నైవేలీ ఫ్యాక్టరీలోను గ్యాస్‌ లీకవడంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధంగా ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు చోటుచేసుకుంది. ఇప్పటికైనా పరిశ్రమలు తెరిచే ముందు యాజమాన్యాలు కనీస జాగ్రత్తలు పాటించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 

మరిన్ని వార్తలు