నౌకలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

22 Jun, 2019 08:50 IST|Sakshi

ముంబై: ముంబైలోని మజ్‌గావ్‌ నౌకానిర్మాణ స్థావరంలో ఇంకా నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగి ఓ కార్మికుడు మరణించాడు. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ (ఎండీఎస్‌ఎల్‌) ఓ ప్రకటన విడుదల చేస్తూ, యార్డ్‌–12704లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందనీ, ఊపిరాడక పోవడం, శరీరం కాలడం కారణంగా బజేంద్ర కుమార్‌ (23) అనే కాంట్రాక్టు కార్మికుడు మరణించాడని తెలిపింది. మరో కార్మికుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయంది.

ఇది కాస్త తీవ్రమైన ప్రమాదమేనని అగ్నిమాపక శాఖ అధికారులు అన్నారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. యుద్ధనౌకలోని రెండు, మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు