ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

14 Dec, 2019 08:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్నిప్రమాదాలతో వణికిపోతోంది. శనివారం మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముంద్క ఏరియాలోని ప్లై వుడ్ ఫ్యాక్టరీలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఇవి మరింత ఎగిసి ఎదురుగా ఉన్న బల్బుల ఫ్యాక్టరీకి కూడా అంటుకున్నాయి. అప్రమత్తమైన ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు 21 ఫైరింజన్లు యత్నిస్తున్నాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

గతవారం ఢిల్లీలోని అనాజ్‌మండీలో అక్రమంగా నిర్వహిస్తున్న బ్యాగ్, పేపర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 43 మంది సజీవదహనమైన విషయం విదితమే. 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఇదే  భవనంలో మరోసారి అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు