ఆ రైలు లేటైతే ప్రయాణికులకు పండుగే

2 Oct, 2019 03:05 IST|Sakshi

ఆలస్యానికి పరిహారం చెల్లింపు

తొలిసారిగా తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో అమలు

న్యూఢిల్లీ: మీరు బుక్‌ చేసుకున్న రైలు పలుమార్లు ఆలస్యంగా వచ్చిందా! ఆలస్యంగా వస్తే మనకు పరిహారం చెల్లిస్తే ఎంత బాగుణ్ణు అని మీకెప్పుడైనా అనిపించిందా! ఇలాంటి మీ ఆలోచన ఫలించినట్టుంది. ఐఆర్‌సీటీసీ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లేటుగా వస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది. ఈ రైలు అక్టోబర్‌ 4 నుంచి ఢిల్లీ – లక్నోల మధ్య పరుగులు పెట్టనుంది. ఈ తరహా ప్రయోగానికి తెరతీస్తున్న తొలి రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్సే కావడం గమనార్హం.

లాభాలివి..
అనుకోని పరిస్థితుల వల్ల ఈ రైలు గంట లేటుగా వస్తే రూ. 100, రెండు గంటలు లేటుగా వస్తే రూ. 250లు ప్రయాణికులకు చెల్లించనుంది. దీనితో పాటు ప్రయాణికులకు రూ. 25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఇవ్వనుంది. సరిపడా పత్రాలు చూపిస్తే రెండు మూడు రోజుల్లోనే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనుంది. రైల్లో ప్రయాణిస్తున్నపుడు ఒకవేళ  దోపిడీ జరిగితే రూ. లక్ష ఇవ్వనున్నట్లు  రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. రైల్లో ఉచిత టీ, కాఫీలు వెండింగ్‌ మెషీన్‌ ద్వారా ఇవ్వనుండగా, ఆర్వో మెషీన్‌ ద్వారా మినరల్‌ వాటర్‌ కూడా అందించనున్నారు. ఈ రైల్లో  లక్నో నుంచి ఢిల్లీకి చార్జీలు ఏసీ చైర్‌ కార్‌కు రూ. 1,125, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌కు రూ. 2,310గా ఉంది. ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్‌ కార్‌ రూ. 1280 కాగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌లో రూ. 2,450గా ఉండనుంది. ఈ రైలు చార్జీలు డిమాండ్‌కు అనుగుణంగా (డైనమిక్‌ ఫేర్‌) పెరుగుతాయి. విమానాల్లోలాగే, రైల్లో కూడా ప్రయాణికులకు ఆహారాన్ని అందించనున్నారు. ఈ తరహా విధానాలు ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతున్నాయి. జపాన్‌లో, పారిస్‌ నగరంలో రైలు లేటయితే ప్రయాణికులకు ఓ సరి్టఫికెట్‌ అందుతుంది. దీన్ని పాఠశాలలు, కళాశాలు, ఆఫీసుల్లో చూపించి ఆలస్యానికి సహేతుక కారణాన్ని చూపవచ్చు.

మరిన్ని వార్తలు