‘జరిగే పెళ్లి కూతురుది కాదయ్యా.. కొడుకుది’

28 Nov, 2016 13:32 IST|Sakshi
‘జరిగే పెళ్లి కూతురుది కాదయ్యా.. కొడుకుది’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ మరోసారి నవ్వుల పాలయ్యారు. తెలిసి తెలియని సమాచారంతో మాట్లాడి అబాసుపాలయ్యారు. గతంలో మాదిరిగానే మరోసారి ఆయన తప్పులో కాలేశారు. బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ కూతురు వివాహం రెండున్నర లక్షల్లోనే చేస్తున్నారా అంటూ కేజ్రీవాల్‌ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మాటలకు వెంటనే స్పందించిన ఎంపీ మహేశ్‌ శర్మ ముందు కేజ్రీవాల్‌ తన మాటలను సరి చేసుకోవాలని అన్నారు.

తన ఇంట్లో వివాహం జరుగుతున్న మాట వాస్తవం అని అయితే, కేజ్రీవాల్ చెప్పినట్లు కూతురు పెళ్లి కాదని కుమారుడు పెళ్లి అని కేజ్రీవాల్‌ పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన చెప్పారు. తాను పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్యాంకు ద్వారానే చెల్లింపులు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఓ దొంగ ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో అతడు బ్యాంకు క్యూలో నిల్చున్న డబ్బు దొరకక ఆత్మహత్య చేసుకున్నాడని ఒకసారి.. సిరియా పిల్లల ఫొటోలు చూపిస్తూ ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద బాధితులు అని పేర్కొంటూ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో పెట్టి నవ్వులపాలయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఎంపీ కుమారుడి వివాహాన్ని కూతురు వివాహంగా చెప్పి అబాసు పాలయ్యారు. 
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 
మరిన్ని వార్తలు