ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు

19 May, 2015 15:28 IST|Sakshi
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు

షాజహాన్పూర్ :  ఉత్తరప్రదేశ్ తో కులం రక్కసి మరోసారి పడగవిప్పింది. షాజహాన్పూర్  జిల్లా హరేవా ప్రాంతంలో అయిదుగురు దళిత మహిళలను నగ్నంగా  ఊరేగించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

తమ అమ్మాయి  దళిత యువకుడితో వెళ్లిపోవడంతో  ఆగ్రహంతో రగిలిపోయిన వెనుకబడిన వర్గానికి చెందిన గ్రామస్తులు మంగళవారం ఉదయం దళిత మహిళలపై విరుచుకుపడ్డారు.  బూతులు  తిడుతూ వారిని ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చారు. చెప్పులతో కొట్టారు..  నడివీధికి తీసుకొచ్చి ఘోరంగా అవమానించారు.  ఒంటిపై ఉన్న దుస్తులను లాగేసి విసిరిపారేశారు.  ఆ తర్వాత  ప్రధాన రహదారిపై ఊరేగించారు. దాదాపు అయిదు  గంటలపాటు ఈ అమానుషకాండ కొనసాగింది.  ఇంత జరుగుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.  కొందరు గ్రామస్తుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు గ్రామంలో మకాం వేశారు. పరిస్థితిని  సమీక్షిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు  అమ్మాయి తండ్రితో సహా నలుగురు వ్యక్తులను  అదుపులోకి తీసుకున్నామన్నారు.  ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ  విచారణకు ఆదేశించారు.  

మరోవైపు  దీనిపై రాజకీయ పార్టీలు  స్పందించాయి. బాధితులకు  న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి.  నిర్లక్ష్యంగా వ్యవహిరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నాయి.

మరిన్ని వార్తలు