ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు

29 Dec, 2019 21:12 IST|Sakshi

సాక్షి, చెనై: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ చెన్నైలోని కొందరు ఆందోళనకారులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. రోడ్లపైనా, కొందరి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. దీంతో పోలీసులు నలుగురు మహిళలను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో ఆ మహిళలు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు, ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ ఆ ముగ్గుల్లో నినాదాలు రాశారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ అసిస్టెంట్‌ కమిషనర్‌ సహా పోలీసు సిబ్బంది నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. వారు నిరసన తెలిపేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, నిరసన తెలిపేందుకు చెన్నై పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని, అందుకే ఈ వినూత్న పంథాను ఎన్నుకున్నామని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు.

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని డీఎంకే నాయకుడు  స్టాలిన్ ఖండించారు. 'ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు' అంటూ ట్వీట్ చేశారు.సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి తిభద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.  నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు