గువాహటి : ఒకపక్క కరోనా వైరస్, ఆఫ్రికన్ ఫ్లూతో ప్రజలు అల్లాడుతుంటే వరదల రూపంలో మరో పిడుగు పడినట్లయ్యింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది. రాష్ర్టంలోని నల్బరి, గోల్పారా, నాగావ్, హోజాయ్ సహా మరో మూడు జిల్లాలు ముంపునకు గురయ్యారు. దీంతో వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 3.81 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్డిఎంఎ) తెలిపింది.
వరదల కారణంగా ముఖ్యంగా గోల్పురా, హోజాయ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కాగా గురువారం ఈ రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అస్సాంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, దాని అనుబంధ ఉపనదుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. 356 గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో 3,880 మందిని 190 సహాయక శిబిరాలకు చేర్చినట్లు తెలిపారు. (జమ్మూకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం )
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు. వరద సమయంలో సత్వర ఉపశమనం, సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమీషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్న ఆయన బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలంతా కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
(ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ )