శ్రీనగర్ : కశ్మీర్లో మరో ఐదుగురు వైద్యులకు కరోనా సోకినట్టుగా అధికారులు సోమవారం వెల్లడించారు. వీరిలో ఎస్ఎంహెచ్ఎస్కు చెందిన ముగ్గురు డాక్టర్లు, ఎస్కేఐఎంఎస్, డెంటల్ కాలేజ్లకు చెందిన ఒక్కో డాక్టర్ ఉన్నారు. అందులో నలుగురు వైద్యులకు కరోనా పేషెంట్లకు చికిత్స అందించే సమయంలో వైరస్ సోకినట్టుగా గుర్తించారు. వీరు నలుగురు కూడా కరోనా సోకిన ఓ మహిళకు చికిత్స అందించారని కోవిడ్ ఆస్పత్రి(చెస్ట్ డిసీజ్హాస్పిటల్) సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు.
తొలుత లుడ్విగ్ ఆంజినాతో బాధపడుతున్న ఆ మహిళకు ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఆ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో.. రెండు రోజుల క్రితం ఆమెను కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతిచెందారు. మరోవైపు జమ్మూకశ్మీర్లో ఇప్పటివరకు 1,188 కరోనా కేసులు నమోదు కాగా, 13 మంది మృతిచెందారు. మొత్తం కరోనా సోకిన వైద్య సిబ్బంది సంఖ్య 16కి చేరింది.(చదవండి : లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు)