ఒడిశాలో ఎదురుకాల్పులు

9 May, 2019 04:53 IST|Sakshi
మావోయిస్టుల మృత దేహాలు

ఐదుగురు మావోయిస్టుల మృతి

కొరాపుట్‌/చర్ల: ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పాడువ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల బడెల్‌ అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో  ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్‌ ఎస్పీ డాక్టర్‌ కన్వర్‌ విశాల్‌ సింగ్‌ బుధవారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బుధవారం మ«ధ్యాహ్నం 2.45 గంటలకు కిటుబ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఓజీ, డీవీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బడెల్‌ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఉభయపక్షాల మధ్య సుమారు గంటసేపు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు హతమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన మొత్తం 4 రైఫిల్స్‌ ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితురాలైన ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్వరూప ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆర్నాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒకరి మృతదేహాన్ని మావోయిస్టులు తీసుకెళ్లగా, మహిళా మావో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు