బలవంతంగా నోట్లో యూరిన్ పోశారు!

7 Apr, 2016 15:05 IST|Sakshi

రోజు రోజుకూ మానవత్వం మంటకలసి పోతోంది. అమానుషం కోరలు చాస్తోంది. సాటి మనిషిని భరించలేని తనం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది.  ఓ కూరగాయల వ్యాపారిపై ఉత్తర ప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటన అదే రుజువు చేస్తోంది.

ఉత్తర ప్రదేశ్ ఆగ్రా నగరానికి దగ్గరలోని ఎత్మద్ పూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ కూరగాయల వ్యాపారి  నోట్లో  ఐదుగురు వ్యక్తులు బలవంతంగా యూరిన్ పోసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భాయీ సాబ్ కాస్త తప్పుకొని దారివ్వండి అంటూ బాధితుడు అడగడమే తప్పయిపోయింది. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న నిరోత్తమ్ ఖాన్ ఆదివారం ఇంటికి వచ్చే సమయంలో ఓ సమాజ్ వాదీ పార్టీ జిల్లా యూనిట్ ఇంఛార్జి తోపాటు ఐదుగురు వ్యక్తులు తాను దారి అడిగినందుకు కొట్టడమే కాక తన నోట్లో బలవంతంగా యూరిన్ పోశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తనకు కాస్త దారివ్వమంటూ పున్నీఖాన్ ను అడగడమే తప్పయిపోయిందని, ఆగ్రహించిన అతడు తన బంధువులతోపాటు తనపై దాడి చేయడమే కాక తన నోట్లో యూరిన్ పోశారని నిరోత్తమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాడి సమయంలో తనకు ఎటువంటి సహాయం దొరకకపోవడంతో దిక్కులేని స్థితిలో ఊరుకున్న బాధితుడు... బుధవారం కొంతమంది సహాయంతో  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు