ఐదుగురిని తొక్కేసిన ఏనుగు..

19 Apr, 2019 18:44 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.  ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఏనుగు దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృతిచెందారు. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. ఒకే రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో ఒకే ఏనుగు దాడికి పాల్పడింది. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కేసింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. 

తర్వాత సంత్‌ పద అనే గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి చంపింది. ఏనుగు దాడితో ఆ ప్రాంతంలోని ప్రజలంతా భయాందోళలను గురవుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషీయా అందే విధంగా చూస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు