రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురి మృతి

2 Nov, 2018 08:42 IST|Sakshi
యువకుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు (కర్టెసీ : న్యూస్‌18)

గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకువెళ్లిన దుండగులు... ఒకరి తర్వాత ఒకరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారి శవాలను అక్కడే పడేశారు. అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు.

కాగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయం గురించి అసోం సీఎంతో మాట్లాడానని పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌సీ ప్రతిఫలమేనా?
‘ఇది చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ పాశవిక హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్‌ఆర్‌సీ (భారత పౌరులను గుర్తించే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌) అభివృద్ధి ఫలితం ఇదేనా’  అంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిలిగురి, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.  (చదవండి : అసోంలో ఏం జరుగుతోంది)

మరిన్ని వార్తలు