తిరువనంతపురం : భారీ వర్షాలు పలు రాష్ట్రాలను వెంటాడుతునే ఉన్నాయి. కుండపోత కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని కాలువతో పాటు పెరియార్ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్పోర్ట్ మూసివేతపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తొలుత శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేసినా, కొచ్చి ఎయిర్పోర్ట్ చేరువలో నీరు నిలిచిపోవడంతో మూసివేత గడువును పొడిగించినట్టు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫేస్బుక్ పేజ్లో తెలిపింది.
మరోవైపు కేరళ ప్రభుత్వం వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళలోని అన్ని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.