షెల్టర్‌ హోం కేసు : మంజు వర్మ భర్త లొంగుబాటు

29 Oct, 2018 16:37 IST|Sakshi
బిహార్‌ సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రి మంజూ వర్మ (ఫైల్‌ఫోటో)

పట్నా : దేశవ్యాప్తంగా దుమారం​రేపిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసుకు సంబంధించి బిహార్‌ మాజీ మంత్రి మంజు వర్మ భర్త సోమవారం కోర్టులో లొంగిపోయారు. షెల్టర్‌ హోం ఘటనలో తన భర్త చంద్రశేఖర వర్మపై ఆరోపణల నేపథ్యంలో మంజు వర్మ మంత్రి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

బెగుసరై జిల్లా మంజ్‌హాల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ర్టేట్‌లో లొంగిపోయిన వర్మను నవంబర్‌ 6వరకూ జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించాలని మేజిస్ర్టేట్‌ యోగేష్‌ కుమార్‌ మిశ్రా ఆదేశించారు. బెగుసరై జిల్లాలోని వర్మ నివాసంలో సీబీఐ దాడుల సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభ్యం కావడంతో కేసు నమోదు చేశారు.

మరోవైపు షెల్టర్‌ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడుల ఆరోపణల కేసులోనూ వర్మ ప్రమేయంపై వార్తలు రావడంతో ఆయన భార్య, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ ఈ ఏడాది ఆగస్ట్‌లో తన పదవికి రాజీనామా చేశారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ద్వారా తొలుత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు