వారిని పైకి పంపించే డ్యూటీ మన ఆర్మీ చేస్తుంది : వి.కె.సింగ్‌

7 Sep, 2019 15:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత దాయాది దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వా శుక్రవారం మరోసారి రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. కశ్మీర్‌ ప్రజలకు పాక్‌ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, అవసరమైతే యుద్ధానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె. సింగ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి పాక్‌ ఆర్మీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని చురకలంటించారు. 

తినడానికి తిండి, కార్యాలయాలు నిర్వహించేందుకు స్తోమత లేనప్పుడు పాకిస్తాన్‌ ప్రభుత్వం నుంచి డబ్బులు గుంజడానికి ఆ దేశ ఆర్మీ ఇలా ప్రేలాపనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ అంశాన్ని చూపెడుతూ పాక్‌ సైన్యం తరచూ అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. ఎల్వోసీ వెంబడి రెండు వేల మందిని పాకిస్తాన్‌ భారత్‌లోకి పంపించడానికి యత్నిస్తోందన్న వార్తలపై ఆయన స్పందిస్తూ..  ‘వారిని వారి (పాక్‌ ఆర్మీ) డ్యూటీ చేయనీయండి. వారిని పైకి పంపించే డ్యూటీ మన ఆర్మీ చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. 
(చదవండి : కశ్మీర్‌ కోసం యుద్ధానికి సిద్ధం: పాక్‌ ఆర్మీ చీఫ్‌)

మరిన్ని వార్తలు