న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టెరి)’ మాజీ చీఫ్ ఆర్కే పచౌరి(79) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డైరెక్టర్గా ఆయన సేవలందించారు. ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి పచౌరి వైదొలిగారు. ‘టెరి’కి పచౌరి అందించిన అనుపమాన సేవలను సంస్థ చైర్మన్ నితిన్ దేశాయి ఒక ప్రకటనలో కొనియాడారు. 1974లో ‘టెరి’ని స్థాపించారు. విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది.