బీజేపీ గూటికి ముకుల్‌ రాయ్‌

3 Nov, 2017 18:04 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తృణమూల్‌ మాజీ ఎంపీ ముకుల్‌ రాయ్‌ శుక్రవారం బీజేపీలో చేరారు. ముకుల్‌ రాయ్‌ బీజేపీలో చేరారని, ఆయన చేరికను తాము సాదరంగా స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. ముకుల్‌ రాయ్‌ అక్టోబర్‌ 11న రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తృణమూల్‌ నుంచి వైదొలగిన వెంటనే ముకుల్‌ రాయ్‌ బెంగాల్‌ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ కైలాష్‌ విజయ్‌వర్గియ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలతో భేటీ కావడంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది.

అంతకుముందు సెప్టెంబర్‌ 25న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముకుల్‌ రాయ్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. శారదా స్కామ్‌లో రాయ్‌ పాత్రపై ఆరోపణల నేపథ్యంలో రాయ్‌ను 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తృణమూల్‌ తొలగించింది.

మరిన్ని వార్తలు