జైపూర్‌ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

18 Dec, 2019 15:50 IST|Sakshi

జైపూర్‌ : 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులను బుధవారం దోషులుగా తేల్చింది. ఒకరిని బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌గా వదిలేసింది. వివరాలు.. 2008 మే నెలలో జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల వ్యాసార్ధంలో, 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్థానిక హనుమాన్‌ ఆలయ సమీపంలోని ఒక బాంబుతో పాటు నాలుగు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో అనేక మంది హనుమాన్‌ భక్తులు, విదేశీ పర్యాటకులు వస్తుండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది.

ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్‌ జిహాదీ ఇస్లామీ (హుజి) అనే ఉగ్రవాద సంస్ధ హస్తం ఉ‍న్నట్టు అనుమానించిన పోలీసులు.. మొహమ్మద్‌ షాబాజ్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ సైఫ్‌ అకా కారియోన్‌, మొహమ్మద్‌ సర్వార్‌ అజ్మి, మొహమ్మద్‌ సైఫ్‌ అలియాస్‌ సైఫుర్‌ రహమాన్‌ అన్సారీ, మొహమ్మద్‌ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం విచారణ ప్రారంభించిన రాజస్థాన్‌ ఏటీసీ విభాగం ఐదుగురిని అరెస్ట్‌ చేసి చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకు విచారణ కొనసాగగా, ప్రత్యేక కోర్టు బుధవారం నలుగురిని దోషులుగా ప్రకటించింది. 

>
మరిన్ని వార్తలు