అస్సాంలో బాంబు పేలుళ్లు

27 Jan, 2020 06:46 IST|Sakshi

గువాహటి: అస్సాంలో గణతంత్ర దినోత్సవ రోజు ఉదయం సమయంలో నాలుగు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ బాంబులను తామే అమర్చినట్లు నిషేధిత మిలిటెంట్‌ సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం– ఇండిపెండెంట్‌ (యూఎల్‌ఎఫ్‌ఏ–ఐ) ఆదివారం ప్రకటించింది. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అయితే గణతంత్ర వేడుకలు జరుపుకోవద్దంటూ పరేశ్‌ బారువా నేతృత్వంలోని యూఎల్‌ఎఫ్‌ఏ–ఐ సహా పలు సంస్థలు ముందే ప్రకటనలు జారీ చేశాయి.

చారైడియో జిల్లాలో ఓ బాంబు పేలుడు జరగ్గా, దిబ్రూగఢ్‌ జిల్లాలో మూడు బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 8:15 నుంచి 8:25 గంటల్లోపే నాలుగు పేలుళ్లు జరిగా యి. ఇందులో ఒక పేలుడు పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. బైక్‌పై వచ్చిన యువకులు గ్రెనేడ్లను ఉంచడం సీసీటీవీల్లో నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవా ల్‌ ఈ పేలుళ్లను ఖండించారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన ఉగ్రసంస్థలు చేసిన పేలుళ్లు అంటూ మండిపడ్డారు. బాధ్యులపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్‌ ద్వారా స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు