నీట్, జేఈఈలకు ఉచిత శిక్షణ ఇస్తాం

31 Aug, 2018 04:22 IST|Sakshi

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ, నెట్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 2019, మే నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2,697 స్టడీ సెంటర్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శిక్షణ కేంద్రాలుగా మారుస్తుందని వెల్లడించారు. ఈ స్టడీ సెంటర్లు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతాయి.

ఈ కేంద్రాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోవు. చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో వెనుకంజ వేస్తున్న విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్‌టీఏ తొలుత జేఈఈ మెయిన్స్‌ విద్యార్థులకు 2019, జనవరిలో మాక్‌ టెస్టులు నిర్వహిస్తారు. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ లో విద్యార్థులు మాక్‌ టెస్టుల కోసం సెప్టెంబర్‌ 1 నుంచి రిజిస్టర్‌ కావొచ్చని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కేంద్రం ఎన్‌టీఏను స్థాపించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు